న్యూఢిల్లీ, జూలై 26: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాల తరఫు ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా మండిపడ్డారు. ‘సరికొత్త’ భారత్లో రాజకీయ నాయకుల ఫోన్ కాల్స్ను ఎప్పటికప్పుడు ‘పెద్దన్న’ (బిగ్బ్రదర్) వింటున్నాడంటూ.. పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి ఆమె ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. బీజేపీలోని కొందరు స్నేహితులతో మాట్లాడిన తర్వాత ఏ పార్టీకి చెందిన వారికి కూడాకాల్స్ చేయలేకపోతున్నానని, కనీసం వారి నుంచి కాల్స్ కూడా తీసుకోలేకపోతున్నానని వాపోయారు. అప్పటి నుంచి తన మొబైల్ నంబర్కు వచ్చే కాల్స్ను డైవర్ట్ చేశారని చెప్పారు. పెద్దన్న ఎల్లప్పుడూ వారిని గమనిస్తున్నాడని, వారి మాటలను వింటుంటాడని బీజేపీ నాయకులంతా భయపడుతున్నట్టు పేర్కొన్నారు.
అందుకే ఎంపీలు, పార్టీల నేతలు చాలా ఫోన్లు వాడుతున్నారని, తరచుగా నంబర్లు మారుస్తున్నారని చెప్పారు. పైగా ఎవరితోనైనా మాట్లాడాలంటే నేరుగా కలిసినప్పుడే గుసగుసలాడుకుంటున్నారని వివరించారు. ఈ తరహా భయం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్కు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘నా కాల్స్ డైవర్ట్ అవుతున్నాయి. సమస్యను పరిష్కరిస్తే ఇకపై బీజేపీ, టీఎంసీ, బీజేడీ ఎంపీలెవ్వరికీ కాల్ చేయబోనని ప్రమాణం చేస్తున్నా’ అని ట్వీట్ చేశారు. అయితే ఈ ఆరోపణలను బీఎస్ఎన్ఎల్ కొట్టిపారేసిందని టెలికం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.