న్యూఢిల్లీ, జూలై 17: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరెట్ అల్వా (80) బరిలో నిల్చోనున్నారు. ఈ మేరకు ఆమె పేరును ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. 17 పార్టీలు ఏకగ్రీవంగా ఈ నిర్ణయాన్ని ఆమోదించాయని తెలిపారు. మంగళవారం అల్వా నామినేషన్ వేస్తారని పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం పవార్ నివాసంలో ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగింది. అనంతరం అల్వాను ప్రతిపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు పవార్ వెల్లడించారు. ‘అల్వాకు మద్దతు ఇవ్వాల్సిందిగా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను కోరనున్నాం. ఈ క్రమంలో వారిని కలిసేందుకు ప్రయత్నిస్తాం. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థికి వారు ఇటీవలే మద్దతు ప్రకటించారు. జేఎంఎం కూడా విపక్ష పార్టీలకే మద్దతు తెలుపుతున్నది’ అని పవార్ పేర్కొన్నారు.
దేశ వైవిధ్యతకు విశిష్ట ప్రతినిధి, మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేయనున్నారని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ట్విట్టర్లో వెల్లడించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీలన్నీ ఒకేతాటిపై ఉంటాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార కూటమి ఎన్డీయే తమ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖడ్ను ప్రకటించిన మరుసటి రోజే విపక్షాలు తమ అభ్యర్థి పేరును వెల్లడించడం గమనార్హం. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనున్న నేపథ్యంలో కొత్త ఉపరాష్ట్రపతి నియామకం కోసం ఆగస్టు 6న ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘటం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.
వినయంతో అంగీకరిస్తున్నా..
విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేయడంపై మార్గరెట్ అల్వా ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనను ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. విపక్షాల నిర్ణయాన్ని అంగీకరిస్తున్నట్టు తెలిపారు. తనపట్ల విశ్వాసం ఉంచిన ప్రతిపక్ష నేతలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. ఎన్డీయే తరఫు ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ సోమవారం నామినేషన్ వేయనున్నారు.
నాలుగు రాష్ర్టాలకు గవర్నర్గా సేవలు
కర్ణాటకలోని మంగళూరులో 1942 ఏప్రిల్ 14న మార్గరెట్ అల్వా జన్మించారు. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాలలో డిగ్రీ విద్యనభ్యసించారు. న్యాయశాస్త్రంలోనూ పట్టా అందుకున్నారు. 1969లో రాజకీయ ప్రవేశం చేసిన ఆమె.. కాంగ్రెస్లో అనేక హోదాల్లో పనిచేశారు. 1974లో తొలిసారి రాజ్యసభకు ఎంపికైన అల్వా.. ఆ తర్వాత 1980, 1986, 1992లో వరుసగా పెద్దలసభకు ప్రాతినిధ్యం వహించారు. అలాగే, 1999లో ఉత్తర కన్నడ లోక్సభ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు. గోవా, గుజరాత్, గవర్నర్గా, రాజస్థాన్కు 20వ గవర్నర్గా, ఉత్తరాఖండ్కు నాలుగో గవర్నర్గా సేవలందించారు. రాజీవ్గాంధీ క్యాబినెట్లో కేంద్రమంత్రిగానూ పనిచేశారు. 1964లో నిరంజన్ థామస్ను పెండ్లి చేసుకున్నారు.