ప్రకాశం : మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) మృతిపై ఆయన భార్య శిరీష అలియాస్ రమాదేవి స్పందించారు. ఆర్కే మృతి చెందినట్లు మీడియాలో మాత్రమే చూస్తున్నామని, మావోయిస్టు పార్టీ నుంచి సమాచారం లేదు అని శిరీష చెప్పారు. మావోయిస్టు పార్టీ ప్రకటించాకే ఆర్కే మృతి చెందారని భావిస్తామన్నారు. ఆర్కే మృతి నిజమైతే మృతదేహం తరలింపులో సహకరించాలని కోరారు. ప్రజల కోసం 40 ఏండ్లుగా ఆర్కే అలుపెరగని పోరాటం చేశారు. సమాజం ఉన్నతంగా ఉండాలని ఆర్కే కోరుకున్నారు. వ్యక్తిగత జీవితాన్ని, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ప్రజల కోసమే పని చేశారు. ఆర్కే తన కన్నబిడ్డను కూడా ఉద్యమానికే అంకితం చేశారు అని శిరీష పేర్కొన్నారు. ప్రస్తుతం శిరీష ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో నివసిస్తోంది.
ఆర్కే మృతి చెందినట్టు గురువారం రాత్రి వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. ఛత్తీస్గఢ్లోని దక్షిణ బస్తర్ అడవుల్లో గురువారం తుదిశ్వాస విడిచినట్టు తెలిసింది. ఇటు మావోయిస్టుపార్టీ గానీ, అటు ఛత్తీస్గఢ్ పోలీసులు గానీ ఆయన మృతిని ధ్రువీకరించలేదు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా మాచర్ల మండలం తుమ్మకోట గ్రామం. వరంగల్ నిట్లో బీటెక్ పూర్తి చేసిన తర్వాత మావోయిస్టు పార్టీలో చేరారు. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కీలక పదవులు నిర్వహించారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్నారు. పలు ఎన్కౌంటర్లలో ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టు చెప్పుకుంటారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మావోయిస్టులతో జరిపిన శాంతిచర్చల్లో ఆర్కే కీలకపాత్ర పోషించారు. ఆయనపై ఏపీ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా ప్రభుత్వాలు రూ.97 లక్షల రివార్డును ప్రకటించాయి.