జల్నా, నవంబర్ 2: మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే ఆమరణ నిరాహార దీక్ష విరమించారు. పూర్తిస్థాయిలో రిజర్వేషన్లు అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వానికి డిసెంబర్ 24ను డెడ్లైన్గా ప్రకటించారు. రెండు నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే భారీస్థాయిలో ఉద్యమం చేపడతామని బీజేపీ-శివసేన సంకీర్ణ సర్కార్ను హెచ్చరించారు. రిజర్వేషన్లపై జరాంగే చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష గురువారం 9వ రోజుకు చేరుకుంది. నలుగురు రాష్ట్ర మంత్రులు జల్నాలోని అంతర్వాలి సారతి గ్రామానికి వెళ్లి, దీక్షను విరమించాలని జరాంగేను కోరారు. మంత్రుల విన్నపాన్ని గౌరవిస్తూ దీక్షను విరమిస్తున్నానని ఆయన ప్రకటించారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు గురువారం రాష్ట్ర సచివాలయం వద్ద తమ నిరసనను కొనసాగించారు. ఈ నేపథ్యంలో సచివాలయం వద్ద కొన్ని గంటలపాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. రిజర్వేషన్లపై దారాశివ్ జిల్లాలోని పలు గ్రామాల్లో నిరసనకారులు ‘జైల్ భరో’ చేపట్టారు.