పనాజీ: గోవా మాజీ సీఎం, దివంగత కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఉత్పల్.. బీజేపీ నేత అటనాసియో మాన్సిరెట్టి చేతిలో పరాజయం చవిచూశారు. చాలా స్వల్ప తేడాతో ఉత్పల్ ఓడిపోయారు. కానీ తాజా గెలుపు పట్ల ఎమ్మెల్యే మాన్సిరెట్టి సంతోషంగా లేరు. బీజేపీ మద్దతుదారులకు తనకు సరైన రీతిలో ఓటెయ్యలేదన్నారు. బీజేపీ నేతలకు ఈ విషయాన్ని చెప్పామని, భవిష్యత్తు గురించి ఆలోచించాలని, ప్రజలకు బీజేపీ సరైన సందేశం ఇవ్వలేదని, ఆ పార్టీలోని అందరి నేతలతో టచ్లో ఉన్నట్లు మాన్సిరెట్టి తెలిపారు.
పనాజీ నియోజకవర్గం నుంచి కాకుండా మరో చోటు నుంచి పోటీ చేయాలని ఉత్పల్కు బీజేపీ ఆఫర్ ఇచ్చింది. కానీ బీజేపీ నిర్ణయాన్ని తిరస్కరించిన ఉత్పల్ .. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. వాస్తవానికి ఉత్పల్ తండ్రి మనోహర్ పారికర్ గడిచిన 25 ఏళ్ల నుంచి పనాజీ సీటు నుంచి గెలిచారు. 2019లో పారికర్ మృతి తర్వాత మాన్సిరెట్టి కాంగ్రెస్ సీటుపై విజయం సాధించారు. ఆయన రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీలు.. పారికర్ కుమారుడికి సపోర్ట్ ఇచ్చాయి. 40 స్థానాలు ఉన్న గోవాలో ప్రస్తుతం బీజేపీ 20 స్థానాల్లో లీడింగ్లో ఉంది.