న్యూఢిల్లీ : ఆపరేషన్ ‘కమలం’ పేరుతో భారతీయ జనతా పార్టీ డర్టీ గేమ్ ఆడుతోందని ఢిల్లీ హోంశాఖ మంత్రి మనీశ్ సిసోడియా విమర్శించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సిసోడియా మీడియాతో మాట్లాడారు. బీజేపీ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతూ ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను వేటాడుతూ.. తద్వారా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేస్తోందని ఆరోపించారు. బీజేపీలో చేరిన ఏ వ్యక్తిని దర్యాప్తు సంస్థలు, కేంద్ర ఏజెన్సీలు వెంటాడవన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కాషాయ పార్టీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిందన్నారు. పదవులు ఇస్తాం, డబ్బులు ఇస్తామని ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారని విమర్శించారు. బీజేపీ నాయకుడు (రామచంద్ర భారతి).. ఏజెంట్గా వ్యవహరిస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
బీజేపీలో చేరితే ఏ ఏజెన్సీలు మిమ్మల్ని ఏం చేయవని రామచంద్ర భారతి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో చెప్పారంటూ మండిపడ్డారు. ఢిల్లీలోనూ 43 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రామచంద్ర భారతి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెప్పారని సిసోడియా పేర్కొన్నారు. తద్వారా కేజ్రీవాల్ సర్కార్ను కూల్చేందుకు కుట్రలకు దిగారని ఆరోపించారు. ఆడియో టేపుల్లో బీజేపీ బేరసారాలు స్పష్టంగా తెలుస్తున్నాయన్నారు. దేశంలో బీజేపీ ఆపరేషన్ కమలం అమలు చేస్తోందని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు బీజేపీ సహచరులు ఇటీవల రూ.100 కోట్ల నగదుతో పట్టుబడ్డారంటూ ముగ్గురి ఫొటోలను ప్రదర్శించారు.
ఢిల్లీలో 43 మంది ఎమ్మెల్యేల కోసం రూ.1075 కోట్లు ఉంచినట్లు మనీష్ సిసోడియా పేర్కొన్నారు. వారికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అంటూ సూటిగా ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిపై విచారణ జరపాలన్నారు. ఇది నిజమైతే దేశానికి ప్రమాదకరమని సిసోడియా పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్షా ఉండడం సిగ్గుచేటని మనీష్ సిసోడియా అన్నారు. ఈ వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉంటే వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని గతంలోనే ఈ విషయం చెప్పామని గుర్తు చేశారు. దీనిపై ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ ఇలా 8 రాష్ట్రాల్లో ఈ ప్రయత్నాలు చేస్తున్నారని, దేశంలో ఇది త్రీవతరమైన సమస్య అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రిని తప్పించాల్సిన అవసరం ఉంది.