Manipur Violence | రాష్ట్రాల్లో శాంతిభద్రతలను సుప్రీంకోర్టు నిర్వహించలేదని, అది ప్రభుత్వం పని అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మణిపూర్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై సోమవారం జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కుకీ గ్రూప్ల తరఫున సీనియర్ న్యాయవాది కోలిన్ గోన్సాల్వేస్ రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రంలోని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు.
అయితే, హింస, ఇతర సమస్యలను మరింత తీవ్రతరం చేసేందుకు ప్రొసీడింగ్స్ను ఉపయోగించుకోవాలని కోరుకోవడం లేదని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో కోర్టు పరిమితులను దృష్టిలో ఉంచుకొని.. సమస్యను మానవతా దృక్పథంతో చూడాలని పేర్కొంది. సమస్యను అర్థం చేసుకున్నామని, ఏమైనా సలహాలు ఇస్తే స్వీకరిస్తామని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఏం చేయగలదన్నదానిపై తమకు స్పష్టత ఉందని, ఏ రాష్ట్రంలోనైనా శాంతి భద్రతలు అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలే చూసుకుంటామని, ఇది మానవతా సంక్షోభమేనని పేర్కొంది. సుప్రీంకోర్టు శక్తి అపారమైందేనని, కానీ ఇలాంటి విషయాల్లో మేం జోక్యం చేసుకోలేమన్నారు. ఆ విషయంపై పూర్తి స్పృహతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న పునరావాస చర్యలపై తాజాగా నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో పరిస్థితులపై సీఎస్ దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టును కోర్టు విచారణకు స్వీకరించింది. మంగళవారం మరోసారి మణిపూర్లో హింసపై సుప్రీంకోర్టు విచారించనున్నది.