Manipur Video | మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అమానవీయ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశామని సీఎం బీరెన్ సింగ్ తెలిపారు. గురువారం ఉదయం ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయగా, సాయంత్రం మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మణిపూర్ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన పెల్లుబుకుతున్న వేళ బీరెన్ సింగ్ ఈ ప్రకటన చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు హురైన్ హెరదాస్ సింగ్ (32)గా గుర్తించిన పోలీసులు గురువారం ఉదయం తోబల్ జిల్లాలో అతడ్ని అరెస్ట్ చేశారు.
గత మే నెల నాలుగో తేదీన ఘటన జరిగితే ఇప్పటి వరకూ నిందితులను పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై దేశవ్యాప్తంగా అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన రీతిలో స్పందించలేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తామే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రోజురోజుకు దేశవ్యాప్తంగా నిరసన పెరుగుతున్న నేపథ్యంలో మణిపూర్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆఘమేఘాలపై ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. దీనిపై లోతైన దర్యాప్తు చేస్తామని, చట్ట ప్రకారం వారికి మరణశిక్ష విధించేందుకు కూడా వెనుకాడబోమని సీఎం బీరెన్ సీంగ్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. ప్రధాన నిందితుడు హురైన్ ఇంటికి స్థానికులు నిప్పు పెట్టారు. కానీ స్థానిక మహిళలు ఈ చర్యలు వ్యతిరేకించారు. నిందితులు చేసింది తప్పేనని, వారిని ఉపేక్షించవద్దని మహిళలు పేర్కొన్నారు. జాతి, కుల, మత బేధాలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలే గానీ, వారి ఆస్తుల ధ్వంసం వల్ల ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళ ఒకరు మీడియాతో అన్నారు.