అగర్తలా : త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఆదివారం ప్రమాణం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ రాయ్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో రాష్ట్రంలో మూడున్నరేళ్ల పాటు కొనసాగిన బిప్లబ్కుమార్ దేబ్ పాలనకు తెరపడినట్లయ్యింది. కార్యక్రమానికి కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్తో పాటు మాజీ సీఎం బిప్లబ్ కుమార్, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
శనివారం బిప్లబ్ దేవ్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన బీజేపీ శాసనసభాపక్షం సమావేశంలో సాహాను సీఎంగా నియమించడాన్ని ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ, మంత్రి రామ్ ప్రసాద్ పాల్ వ్యతిరేకించారు. అయితే, ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం కొద్దిసేపటికి ఇద్దరు మంత్రులు రాజ్భవన్కు చేరుకున్నారు.
రాష్ట్రంలో బీజేపీ పాలనలో ‘ఫాసిస్ట్ తరహా హింస’ జరిగిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష సీపీఐ-ఎం ఎమ్మెల్యే ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించారు. త్రిపురలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని సీఎంను మార్చినట్లుగా భావిస్తున్నారు. అంతకు ముందు సైతం పలు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఇదే విధానాన్ని అవలంభించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో త్రిపురలో ఎన్నికలు జరుగనున్నాయి.