Sumalatha | త్వరలో లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కర్ణాటకలోని మాండ్య ఎంపీ, ప్రముఖ సినీ నటి సుమలతా అంబరీష్ గురువారం బీజేపీ అగ్రనేతలతో సమావేశం అయ్యారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తదితరులతో ఆమె భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. మాండ్య లోక్సభ స్థానం నుంచి తిరిగి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడానికే ఆమె బీజేపీ అగ్ర నాయకత్వాన్ని కలిసి ఉంటారన్న చర్చ సాగుతున్నది.
గత లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలతా అంబరీష్.. జేడీఎస్ అధినేత- మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు నిఖిల్ కుమారస్వామిని ఓడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో సమావేశమైన ఫోటోలను సుమలతా అంబరీష్ తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
‘నేను ఈనాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్లతో సమావేశమయ్యాను. మాండ్య లోక్ సభ నియోజకవర్గం, లోక్ సభ ఎన్నికలపై చర్చించాను. వారు తమ విలువైన సమయాన్ని ఇచ్చి నేను చెప్పింది విన్నందుకు, వారు చేసిన విలువైన సూచనలకు ధన్యవాదాలు’ అని సుమలతా అంబరీష్ వ్యాఖ్యానించారు.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమె బీజేపీలో చేరతారని ఊహాగానాలు వచ్చినా బయటి నుంచే ఆ పార్టీకి మద్దతు తెలిపారు. ఒకవేళ బీజేపీ తన ప్రతిపాదనను తిరస్కరిస్తే తనకు ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయని చెప్పారని సుమలతా అంబరీష్ సన్నిహిత వర్గాల కథనం. కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తనను సంప్రదిస్తున్నారని ఇటీవల ఓ న్యూస్ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.