న్యూఢిల్లీ: ఒక వ్యక్తి ఒక్క పైసా కూడా చెల్లించకుండా ఫైవ్ స్టార్ హోటల్లో (Star Hotel) ఏకంగా రెండేళ్ల పాటు బస చేశాడు. హోటల్ సిబ్బందితో అతడు కుమ్మక్కై పాల్పడిన ఈ మోసం ఇటీవల బయటపడింది. దీంతో ఆ వ్యక్తితోపాటు ఈ మోసానికి సహకరించిన ఫైవ్ స్టార్ సిబ్బందిపై కేసు నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం సమీపంలోని ఏరోసిటీలో రోసేట్ హౌస్ అనే ఫైవ్ స్టార్ హోటల్ ఉంది. 2019 మే 30న అంకుష్ దత్తా ఒక రాత్రి బస కోసం ఆ హోటల్లో రూమ్ బుక్ చేసుకుని బస చేశాడు. మారునాడు మే 31న హోటల్ రూమ్ను అతడు ఖాళీ చేయాల్సి ఉంది. అయితే దత్తా సుమారు రెండేళ్లపాటు ఆ హోటల్ రూమ్లోనే ఉన్నాడు. 603 రోజులపాటు అక్కడ బస చేశాడు. అయితే ఒక్క పైసా కూడా అతడు చెల్లించకుండా హోటల్ గదిని ఖాళీ చేశాడు. కొంత మంది హోటల్ సిబ్బందితో కుమ్మక్కై ఈ మోసానికి పాల్పడ్డాడు.
కాగా, ఆడిట్లో రికార్డుల తనిఖీల సందర్భంగా ఇటీవల ఈ మోసం బయటపడింది. దీంతో బర్డ్ ఎయిర్పోర్ట్స్ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంకుష్ దత్తాతోపాటు ఆ స్టార్ హోటల్ ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ హెడ్ ప్రేమ్ ప్రకాష్, మరి కొందరు సిబ్బంది ఈ మోసానికి పాల్పడినట్లు ఆరోపించింది. హోటల్ రూమ్ రేట్లను నిర్ణయించడం, బకాయిలను ట్రాక్ చేసే అధికారం ఉన్న ప్రకాష్, హోటల్ కంప్యూటర్ సిస్టమ్ను యాక్సెస్ చేయడం ద్వారా నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిపింది. అంకుష్ దత్తా నుంచి డబ్బులు తీసుకున్న ప్రకాష్, భారీగా అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపించింది. బిల్లులను ఫోర్జరీ చేయడం, తప్పుగా ఎంట్రీ చేయడం, ఇతర వ్యక్తుల పేర్లతో హోటల్ రూమ్ బిల్లులు చెల్లించడం, బకాయిలను వేరే వ్యక్తుల పేరుతో చూపడం, బకాయిల విషయాన్ని సీఈవో, ఫైనాన్స్ కంట్రోల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడం వంటి అనేక అక్రమాలకు ప్రకాష్, ఇతర హోటల్ సిబ్బంది పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
మరోవైపు 603 రోజుల పాటు హోటల్లో బస చేసిన అంకుష్ దత్తా రూ.58 లక్షలకుపైగా చెల్లించాల్సి ఉండగా ఒక్కపైసా కూడా చెల్లించకుండా హోటల్ రూమ్ ఖాళీ చేసినట్లు ఆ సంస్థ ఆరోపించింది. అలాగే వేర్వేరు తేదీల్లో అతడు ఇచ్చిన రూ.10 లక్షలు, రూ.7 లక్షలు, రూ.20 లక్షల చెక్కులు బౌన్స్ అయినట్లు తెలిపింది. అయినప్పటికీ హోటల్ అధికారి ప్రకాష్ ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లలేదని ఆరోపించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.