తిరువనంతపురం: నిద్రిస్తున్న కుటుంబ సభ్యులకు ఒక వ్యక్తి నిప్పు పెట్టాడు. (man sets family ablaze) ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్రంగా కాలిన గాయాలైన కుటుంబ సభ్యుల్లో ఇద్దరు మరణించారు. ఆ వ్యక్తితోపాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కొట్టెక్కటిల్ జాన్సన్ అనే వ్యక్తి మన్నుతి సమీపంలోని ప్రాంతంలో నివసిస్తున్నాడు. కుటుంబ గొడవల కారణంగా గురువారం తెల్లవారుజామున దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో నిద్రిస్తున్న కొడుకు జోజి, కోడలు లిజి, మనవడు టెండూల్కర్కు నిప్పంటించాడు. అనంతరం టెర్రస్పైకి వెళ్లి విషం సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
కాగా, మంటలను గమనించిన పొరుగువారు వాటిని ఆర్పివేశారు. అలాగే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు తీవ్రంగా కాలిన గాయాలైన ముగ్గురు కుటుంబ సభ్యులను, టెర్రస్పై అపస్మారక స్థితిలో ఉన్న జాన్సన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి కుమారుడు, మనవడు చికిత్స పొందుతూ మరణించారు. జాన్సన్, అతడి కోడలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.