న్యూఢిల్లీ: ఒక వ్యక్తి మహిళను దారుణంగా హింసించాడు. వేడివేడి పప్పు ఆమెపై పోయడంతోపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ( Man Rapes, Tortures Woman) బాధితురాలి ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. జనవరి 30న ఒక వ్యక్తి తన భార్యను కొడుతున్నట్లు నెబ్ సరాయ్ పోలీస్ స్టేషన్కు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ మహిళను కాపాడారు. ఆమె శరీరంపై 20కు పైగా కాలిన గాయాలు ఉండటంతో ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
కాగా, పోలీసులు ఆ మహిళను ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. తాము భార్యాభర్తలు కాదని తెలిపింది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్కు చెందిన తనకు ఢిల్లీలో ఉంటున్న 28 ఏళ్ల పరాస్తో మూడు నెలల కిందట ఫోన్లో పరిచయం ఏర్పడినట్లు చెప్పింది. జనవరి మొదటి వారంలో బెంగళూరులోని ఇంట్లో పని కుదరడంతో అక్కడకు వెళ్లేందుకు ఢిల్లీ చేరుకున్నట్లు వెల్లడించింది. పరాస్ను కలువడంతో ఢిల్లీలో పని ఇప్పిస్తానని హామీ ఇచ్చాడని, దీంతో అతడు నివసిస్తున్న అద్దె ఇంట్లో నెల రోజులుగా ఉంటున్నట్లు ఆ మహిళ తెలిపింది.
మరోవైపు కొన్ని రోజులుగా పరాస్ ఆ మహిళను కొట్టి హింసించసాగాడు. ఉడుకుతున్న వేడి వేడి పప్పును ఆమె శరీరంపై పోసేవాడు. అతడు వారం రోజులుగా లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పరాస్ను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉత్తరాఖండ్కు చెందిన నిందితుడు ఢిల్లీలోని ఒక ఈటరీలో కుక్గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.