ముంబై: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) వ్యక్తిగత సహాయకుడి (పీఏ)గా నమ్మించిన ఒక వ్యక్తి మంత్రి పదవుల పేరుతో బీజేపీ ఎమ్మెల్యేల నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. వారిని మోసగించేందుకు ప్రయత్నించాడు. ఒక బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదుతో గుజరాత్కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. గుజరాత్లోని మోర్బీ ప్రాంతానికి చెందిన నీరజ్ సింగ్ రాథోడ్, మహారాష్ట్రకు చెందిన నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సంప్రదించాడు. జేడీ నడ్డా వ్యక్తిగత సహాయకుడిగా పరిచయం చేసుకున్నాడు. బీజేపీ ఎమ్మెల్యేలు వికాస్ కుంభారే, టెక్చంద్ సావర్కర్, తానాజీ ముత్కులే, నారాయణ్ కుచేలతో ఫోన్లో పలుసార్లు మాట్లాడాడు. సీఎం ఏక్నాథ్ షిండే కేబినెట్లో మంత్రి పదవులు ఇప్పిస్తానని వారిని నమ్మించాడు. త్వరలో జరుగనున్న మంత్రివర్గ విస్తరణలో వారికి మంత్రి పదవులు దక్కుతాయని చెప్పి లక్షల్లో డబ్బులు డిమాండ్ చేశాడు. అలాగే జేపీ నడ్డా గొంతు ఉన్న వ్యక్తితో వారిని మాట్లాడించాడు.
కాగా, గుజరాత్లో పెద్ద కార్యక్రమం కోసం నిధులు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే వికాస్ కుంభారేకు నీరజ్ సింగ్ రాథోడ్ పలుమార్లు ఫోన్ చేశాడు. అలాగే మహారాష్ట్ర కేబినెట్లో అర్బన్ డెవలప్మెంట్ మంత్రి పదవి ఆయనకు దక్కుతుందని చెప్పాడు. అయితే దీనిపై అనుమానం రావడంతో ఆ ఎమ్మెల్యే ఆరా తీశారు. జేడీ నడ్డా వ్యక్తిగత సహాయకుడి పేరుతో తనను మోసగించేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడని ఆ ఎమ్మెల్యే గ్రహించారు. తన పీఏ ద్వారా నాగపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద నమోదు చేసిన పోలీసులు నీరజ్ సింగ్ రాథోడ్ను అరెస్ట్ చేశారు.