చండీగఢ్: ఎయిర్ హోస్టెస్ (Air Hostess) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన విమాన ప్రయాణికుడిపై ఆమె ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. పంజాబ్లోని జలంధర్ జిల్లా కోట్లి గ్రామానికి చెందిన రాజిందర్ సింగ్ ఆదివారం ఇండిగో విమానంలో దుబాయ్ నుంచి అమృత్సర్కు ప్రయాణించాడు. అయితే విమానం గాల్లో ఉండగా మద్యం మత్తులో ఉన్న అతడు ఎయిర్ హోస్టెస్ పట్ల దురుసుగా, అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే విమాన సిబ్బంది జోక్యం చేసుకున్నారు. అమృత్సర్ ఎయిర్పోర్ట్లోని కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చారు. దీంతో సెక్యూరిటీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ఆ విమానం అమృత్సర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాగానే ప్రయాణికుడు రాజిందర్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఇటీవల విమాన ప్రయాణికుల ప్రవర్తన మితిమీరుతున్నది. కొందరు ప్రయాణికులు విమాన సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించగా మరి కొందరు తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేశారు. గత నెలలో న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో ఒక భారతీయుడు మద్యం మత్తులో ప్రయాణికుడిపై వాగ్వాదానికి దిగటంతోపాటు మూత్ర విసర్జన చేశాడు.
గత ఏడాది నవంబర్లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఎయిరిండియా విమానంలో ప్రయాణించిన శంకర్ మిశ్రా మద్యం మత్తులో వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ సంఘటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయగా ఆ తర్వాత బెయిల్ పొందాడు.