ముంబై: ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి కోడ్తో సూసైడ్ లెటర్ రాశాడు. (code in suicide note) దానిని డీకోడ్ చేసిన పోలీసులు అతడు హత్య చేసిన ప్రియురాలి మృతదేహాన్ని గుర్తించారు. నెల రోజుల తర్వాత యువతి మిస్సింగ్ కేసును చేధించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. 2023 డిసెంబర్ 12న కాలేజీకి వెళ్లిన 19 ఏళ్ల వైష్ణవి బాబర్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆ యువతి మిస్సింగ్పై ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం వెతకసాగారు.
కాగా, 24 ఏళ్ల వైభవ్ అదే రోజున రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జుయినగర్ స్టేషన్ వద్ద రైలు పట్టాలపై అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వైభవ్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అతడి మొబైల్ ఫోన్లో ఉన్న సూసైడ్ నోట్ను పరిశీలించారు. ఆ నోట్లో ‘ఎల్01-501’ వంటి కొన్ని కోడ్లు ఉన్నాయి.
మరోవైపు వైభవ్ సూసైడ్ లెటర్లోని కోడ్ను పోలీసులు ఇటీవల డీకోడ్ చేశారు. ఖార్ఘర్ హిల్స్ ప్రాంతంలోని అడవిలో ఉన్న ఒక చెట్టు నంబర్గా గుర్తించారు. డిసెంబర్ 12న వైష్ణవి, వైభవ్ ఆ అటవీ ప్రాంతం వద్ద ఉన్నట్లు సీసీటీవీ వీడియో ఫుటేజ్ ద్వారా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అదృశ్యమైన వైష్టవి కోసం అటవీ శాఖ, ఫైర్ సిబ్బందితో కలిసి పోలీసులు ఆ ప్రాంతంలో వెతికారు. డ్రోన్లు కూడా వినియోగించి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
చివరకు పది రోజుల తర్వాత అడవిలోని ఒక చెట్టు పొదల వద్ద కుళ్లిన స్థితిలో ఉన్న వైష్టవి మృతదేహాన్ని గుర్తించారు. తనతో దూరంగా ఉండటంతో ఆగ్రహించిన వైభవ్ ఆమె గొంతునొక్కి హత్య చేసి మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేసినట్లు పోలీసులు గ్రహించారు.