భువనేశ్వర్ : కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పధకం ప్రకటించిన అనంతరం ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం లిఖిత పరీక్షను రద్దు చేయడంతో మనస్దాపానికి గురైన ఒడిషా యువకుడు తనువు చాలించాడు. భారత సైన్యంలో చేరాలని తన కుమారుడి కల నెరవేరకపోవడంతో తీవ్ర ఆందోళనకు లోనై ఆత్మహత్య చేసుకున్నాడని యువకుడి తండ్రి ఆరోపించారు. మృతుడిని బాలాసోర్ జిల్లా టెనెటి గ్రామానికి చెందిన ధనంజయ్ మహంతిగా గుర్తించారు. భారత సైన్యంలో చేరాలనే ఉత్సుకతతో ధనంజయ్ కఠోర శిక్షణ పొందాడు.
అగ్నిపథ్ పధకాన్ని ప్రకటించిన క్రమంలో అధికారులు లిఖిత పరీక్షను రద్దు చేయడంతో మనస్దాపానికి లోనై తన కుమారుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని ధనంజయ్ తండ్రి వాపోయారు. గత నాలుగేండ్లుగా తాము ఆర్మీలో చేరాలని శిక్షణ పొందుతున్నామని, ధనంజయ్ ఏడాదిన్నర కిందటే ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష పూర్తి చేశాడని మృతుడి స్నేహితుడు పితబస్ రాజ్ చెప్పారు. రాత పరీక్ష రాయాల్సి ఉండగా కొవిడ్-19 కారణంగా పలుమార్లు వాయిదా పడిందని, చివరికి అగ్నిపధ్ స్కీమ్తో రాతపరీక్ష రద్దయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాము ఇప్పటికే వయో పరిమితి దాటామని, యూపీ, బీహార్, కోల్కతాలో పలువురు యువకులు ఆత్మహత్య చేసుకున్నారని వాట్సాప్ గ్రూపుల్లో చూసిన ధనంజయ్ గతరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. తనువు చాలించే ముందు చివరిసారిగా ఈ ప్రభుత్వాన్ని నమ్మవద్దని, ఎన్నటికీ ఈ పాలకులకు ఓటు వేయవద్దని మెసేజ్ చేశాడని చెప్పారు. ఇక ఎదిగిన కొడుకు కన్నుమూయడంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.