ముంబై: పాన్ షాప్ వద్ద స్మోక్ చేస్తున్న ఇద్దరు అమ్మాయిలను ఒక వ్యక్తి తదేకంగా చూశాడు. ఒక మహిళ తిట్టడంతోపాటు అతడి మీదకు పొగ ఊదింది. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఆ వ్యక్తి హతమయ్యాడు. (Man Killed For Staring At Women Smoking) మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి మహాలక్ష్మి నగర్ ప్రాంతంలోని ఒక పాన్ షాప్ వద్ద 30 ఏళ్ల జయశ్రీ పంజాడే, ఆమె స్నేహితురాలు సవితా సాయిరే కలిసి సిగరెట్ స్మోక్ చేస్తున్నారు. 28 ఏళ్ల రంజిత్ రాథోడ్ సిగరెట్లు కొనేందుకు ఆ పాన్ షాప్ వద్దకు వచ్చాడు. అక్కడ స్మోక్ చేస్తున్న ఇద్దరు అమ్మాయిలను అతడు తదేకంగా చూశాడు.
కాగా, ఇది చూసి రంజిత్తో జయశ్రీ వాగ్వాదానికి దిగింది. అసభ్యకరంగా తిట్టడంతోపాటు అతడి మీదకు సిగరెట్ పొగ వదిలింది. రంజిత్ దీనిని తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. దీంతో తన స్నేహితుడైన ఆకాష్ రౌత్కు జయశ్రీ ఫోన్ చేసింది. స్నేహితులతో కలిసి అక్కడకు వచ్చిన అతడు రంజిత్తో గొడవకు దిగాడు. అతడ్ని పలుమార్లు కత్తితో పొడిచిన తర్వాత వారంతా అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు స్థానికులు దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన రంజిత్ రాథోడ్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. నిందితులైన జయశ్రీ, సవిత, ఆకాష్ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.