లక్నో: యువతిని కిడ్నాప్ చేసిన వ్యక్తి తన ఫ్యాక్టరీలో నిర్బంధించి రాత్రంతా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉదయం అక్కడి నుంచి తప్పించుకున్న ఆమె తన ఇంటికి చేరుకుని జరిగిన సంగతి చెప్పింది. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో (Gorakhpur Crime) ఈ దారుణ సంఘటన జరిగింది. ఖోరాబర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ పెద్ద మేనల్లుడు ఒక యువతిని కిడ్నాప్ చేశాడు. శివారులోని తన ఫ్యాక్టరీలో ఆమెను బంధించాడు. ఆ యువతిపై రాత్రంతా లైంగిక దాడికి పాల్పడ్డాడు.
కాగా, బాధిత యువతి ఆ మరునాడు అక్కడి నుంచి తప్పించుకుని బయటపడింది. తీవ్ర గాయాలతో బాధపడుతూ అతి కష్టంతో తన ఇంటికి చేరుకుంది. జరిగిన దారుణం గురించి కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు వెంటనే ఆమెను ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు ఈ దారుణం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు కూడా వెంటనే స్పందించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. నిందితుడు రాజన్ రాజ్భర్ను అరెస్ట్ చేశారు. అయితే ఆ నిందితుడితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని పోలీస్ అధికారి వెల్లడించారు.