జల్పాయ్గురి: ఆవేశం అనర్థానికే అనే విషయాన్ని మరో ఘటన రుజువు చేసింది. ఇంతకూ ఏం జరిగిందంటే.. ఓ యువకుడు గత అర్ధరాత్రి తన ప్రియురాలికి వీడియోకాల్ చేశాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దాంతో ఆవేశానికి లోనైన యువకుడు ప్రియురాలితో వాగ్వాదం చేస్తూనే.. కోపంతో బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకేశాడు. అనంతరం జల ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జల్పాయ్గురి జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జల్పాయ్గురి జిల్లా కేంద్రానికి చెందిన ధీరజ్ ప్రజాపతి స్థానికంగా ఓ యువతిని ప్రేమించాడు. ఈ క్రమంలో వీడియో కాల్ మట్లాడుతూ తీస్తానదిపై ఉన్న బ్రిడ్జి మీదకు వెళ్లాడు. మాటల్లోనే ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దాంతో క్షణికావేశానికి లోనైన ధీరజ్ ప్రజాపతి.. ఫోన్ మాట్లాడుతూనే నదిలోకి దూకేశాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గల్లంతైన ధీరజ్ కోసం సెర్చింగ్ చేపట్టారు.