లక్నో: తన భర్తను బలవంతంగా మతం మార్చి (Forcible Convertion) ముస్లిం మహిళతో పెళ్లి చేశారని ఒక వ్యక్తి భార్య ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ హమీర్పూర్లోని మౌధాలో నాయబ్ తహసీల్దార్గా ఆశిష్ కుమార్ గుప్తా పని చేస్తున్నాడు. అయితే తన భర్త అదృశ్యమయ్యాడని, నాలుగు నెలలుగా ఇంటికి రావడం లేదని ఆశిష్ కుమార్ భార్య ఆర్తి గుప్తా కాన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 24న తన భర్తను బలవంతంగా మతం మార్చి వివాహేతర సంబంధం ఉన్న ముస్లిం మహిళ రుఖ్సార్తో పెళ్లి చేశారని ఆరోపించింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తనకు తెలిసినట్లు పేర్కొంది.
కాగా, ఆర్తి గుప్తా ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. ఆమె భర్త ఆశిష్ కుమార్ గుప్తా, రుఖ్సార్, ఆమె తండ్రి మౌల్వీ, మున్నా, ఆధాతి, మరి కొందరిపై కేసు నమోదు చేశారు. మౌల్వీ, మున్నాను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు మౌదాహాలోని మసీదులో ఆశిష్ గుప్తా నమాజ్ చేసేవాడని సంరక్షకుడు తెలిపాడు. మహ్మద్ యూసఫ్గా అతడు పరిచయం చేసుకున్నట్లు చెప్పాడు. అయితే దీని గురించి తమకు తెలియదని మౌదాహ తహసీల్దార్ బలరాం గుప్తా వెల్లడించారు.