అహ్మదాబాద్: ఒక వ్యక్తి తీసుకున్న అప్పుపై వడ్డీ చెల్లించలేకపోయాడు. దీంతో వడ్డీ వ్యాపారి శిక్షగా ఆ వ్యక్తి భార్యపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. ఆటో డ్రైవర్గా పని చేస్తున్న ఒక వ్యక్తి 2021లో అజిత్ సింగ్ చావ్డా అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ.50,000 అప్పు తీసుకున్నాడు. ప్రతీ రోజు వడ్డీగా రూ.1,500 చెల్లించేందుకు ఒప్పుకున్నాడు. ఈ ఏడాది జనవరి వరకు ఆ మేరకు వడ్డీ చెల్లించాడు. అనంతరం ఆర్థిక సమస్యల వల్ల రోజు వారీ వడ్డీ చెల్లించలేకపోయాడు. దీంతో కొన్ని నెలలకు ఆ వడ్డీ మరింతగా పేరుకుపోయింది.
ఈ నేపథ్యంలో వడ్డీ వ్యాపారి అజిత్ సింగ్ వ్యాపార భాగస్వామి దీపక్ వగాడియా రంగంలోకి దిగాడు. అతడు ప్రతీ రోజు ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లి వడ్డీ డబ్బుల కోసం వారిని వేధించసాగాడు. కొంత గడువు కోరిన ఆ దంపతులను బెదిరించాడు. ఆటో డ్రైవర్ భార్యను కిడ్నాప్ చేసి అతడిపై తప్పుడు కేసు పెడతానని, వారి పిల్లలను చంపుతానని హెచ్చరించాడు.
అలాగే వడ్డీ చెల్లించనందుకు శిక్షగా అప్పు తీసుకున్న వ్యక్తి భార్యను బెదిరించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. అతడి వేధింపులు భరించలేని బాధితురాలు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు దీపక్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.