తిరువనంతపురం: ఆసుపత్రిలో ఉన్న మహిళ వద్దకు ఆమె ప్రియుడు వెళ్లాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన అతడు కత్తి బయటకు తీశాడు. ఇది చూసి ఆమె పరుగులుపెట్టింది. వెంబడించిన అతడు కత్తితో పొడిచి ఆ మహిళను చంపాడు (Woman Stabbed To Death). కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 40 ఏళ్ల లిజీ తల్లి అంగమాలిలోని ఎంఏజీజే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. దీంతో తల్లికి సహాయంగా ఆమె ఉన్నది.
కాగా, ప్రియుడు మహేష్ శనివారం మధ్యాహ్నం ఆ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. ఆసుపత్రిలోని నాలుగో అంతస్తులో లిజీని కలిసి మాట్లాడాడు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో వెంట తెచ్చిన కత్తిని మహేష్ బయటకు తీశాడు. లిజీపై దాడి చేయబోగా తప్పించుకునేందుకు ఆమె పరుగెత్తింది. అయితే మహేష్ ఆమెను వెంబడించాడు. కత్తితో పలుమార్లు పొడిచాడు. దీంతో రక్తం మడుగుల్లో పడి లిజీ చనిపోయింది.
మరోవైపు ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులు, అక్కడున్న కొందరు వ్యక్తులు మహేష్ను నిలువరించేందుకు ప్రయత్నించారు. అయితే కత్తిని చూపించి వారిని భయపెట్టాడు. చివరకు వారంతా కలిసి అతడ్ని పట్టుకున్నారు. ఈ విషయం తెలిసి ఆసుపత్రికి చేరుకున్న పోలీసులకు మహేష్ను అప్పగించగా అతడ్ని అరెస్ట్ చేశారు. అయితే మహేష్ లిజీని హత్య చేయడానికి కారణం ఏమిటన్నది తెలుసుకుంటామని పోలీస్ అధికారి చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.