ప్రయాగ్రాజ్: సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav), ఆయన భార్య డింపుల్ యాదవ్.. ఇటీవల మరణించిన గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మాద్ సమాధి వద్ద నివాళి అర్పిస్తున్నట్లు ఓ ఫోటో వైరల్ అయ్యింది. అయితే ఆ నకిలీ ఫోటోను షేర్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. అతనిపై కేసు బుక్ చేశారు. కొలనల్గంజ్ అదనపు ఎస్పీ రాజీవ్ యాదవ్ దీనిపై ప్రకటన చేశారు. మనోజ్ శ్రీవాత్సవ్ అనే వ్యక్తి ఆ ఫోటోను షేర్ చేసినట్లు గుర్తించారు. జార్జ్టౌన్ పోలీసు స్టేషన్ లో అతనిపై ఐపీసీ 504, ఐటీ యాక్ట్లోని 67 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన స్థానిక నేత సందీప్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసును ఫైల్ చేశారు. తండ్రి ములాయం సింగ్ యాదవ్ సమాధి వద్ద అఖిలేశ్ నివాళి అర్పిస్తున్న ఫోటోను తీసుకుని అతిక్ సమాధి వద్ద నివాళి అర్పిస్తున్న రీతిలో పోస్టు చేశారు.