లక్నో: సహజీవనం సమయంలో ఇచ్చిన నగదు, నగలు తిరిగి ఇవ్వాలని ప్రియురాలిని ఒక వ్యక్తి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తన స్నేహితులతో కలిసి అతడ్ని ఆమె కొట్టింది. బలవంతంగా విషం తాగించింది. దీంతో అస్వస్థతకు గురైన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. (Man Forced To Drink Poison By Girlfriend) ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హమీర్పూర్కు చెందిన శైలేంద్ర గుప్తా మహోబాలోని ప్రైవేట్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల కిందట కాలిపహరి గ్రామానికి చెందిన ఒక మహిళతో అతడికి పరిచయం ఏర్పడింది. దీంతో ఈ జంట ఒక అద్దె ఇంట్లో కలిసి నివసించారు. కొంతకాలం వారిద్దరూ సహజీవనం చేశారు. ఆ సమయంలో విలువైన నగలు, నాలుగు లక్షల నగదు తన ప్రియురాలికి అతడు ఇచ్చాడు.
కాగా, కొన్నేళ్ల తర్వాత ఆ మహిళకు మరో వ్యక్తి పరిచయమయ్యాడు. దీంతో శైలేంద్రకు ఆమె దూరంగా ఉండటంతో వారిద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలో తాను ఇచ్చిన నగలు, నగదు తిరిగి ఇవ్వాలని శైలేంద్ర ఆమెను డిమాండ్ చేశాడు. దీని కోసం ఆ మహిళ నివసించే ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా తన సహచరులతో కలిసి ఆమె అతడ్ని కొట్టింది. అలాగే బలవంతంగా విష పదార్థాన్ని తాగించింది.
మరోవైపు శైలేంద్ర తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో జిల్లా ఆసుపత్రికి అతడ్ని తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు, నగలు గురించి మరోసారి అడిగితే తప్పుడు కేసులో ఇరికిస్తామని ఆ మహిళ, ఆమె ఫ్రెండ్స్ తనను బెదిరించినట్లు శైలేంద్ర ఆరోపించాడని పోలీస్ అధికారి తెలిపారు. నిందితులను సదాబ్ బేగ్, దీపక్, హ్యాపీగా గుర్తించినట్లు చెప్పారు. ఆ ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.