లక్నో : జై శ్రీరామ్ అని పఠించలేదని ఓ ముస్లిం యువకుడిపై దాడి చేసి, అతని వద్ద ఉన్న రూ. 10 వేలను దొంగిలించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కు సమీపంలోని ఓ గ్రామంలో వెలుగు చూసుంది. ఓ ముస్లిం యువకుడు బట్టలు అమ్ముకునేందుకు హర్దౌగంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి వెళ్లాడు. అక్కడ రాజు, ఆయన కుమారుడు దేవేంద్ర కలిసి ఆ యువకుడిని అడ్డుకున్నారు. నీ పేరేంటని ప్రశ్నించారు. బట్టలు తక్కువ ధరకు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ముస్లిం యువకుడికి, రాజుకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జై శ్రీరామ్ అని నినదించాలని రాజు డిమాండ్ చేశాడు.
అయితే ఆ ముస్లిం యువకుడు జై శ్రీరామ్ అని పఠించకపోయేసరికి అతనిపై దాడి చేశారు. ఆ యువకుడి వద్ద ఉన్న రూ. 10 వేలను దొంగిలించారు. దీంతో బాధిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో విచారణ నిమిత్తం రాజు, దేవేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో వారిద్దరూ భారత్ మాతా కీ జై అని నినదించారు. అంతేకాదు… అరెస్టు వ్యవహారాన్ని చిత్రీకరిస్తున్న ఓ యువకుడిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు.