చండీగఢ్: ఒక వ్యక్తిని నలుగురు యువతులు కిడ్నాప్ చేశారు. అనంతరం అతడికి డ్రగ్స్ ఇచ్చి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. పంజాబ్లోని జలంధర్లో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. వివాహితుడు, ముగ్గురు పిల్లలున్న వ్యక్తి ఒక ఫ్యాక్టరీలో కూలీగా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి పని ముగిసిన తర్వాత అతడు నడుస్తూ ఇంటికి వెళ్తున్నాడు. కపుర్తలా రోడ్లో కారులో వచ్చిన నలుగురు యువతులు ఆ వ్యక్తికి ఒక స్లిప్ ఇచ్చి అడ్రస్ అడిగారు. ఆ పేపర్ను చూస్తున్న అతడి కళ్లలోకి ఏదో స్ప్రే చేశారు. అనంతరం ఆ వ్యక్తి కళ్లకు గుడ్డ కట్టారు. చేతులను కూడా కట్టేసిన ఆ యువతులు తమ కారులో అతడ్ని కిడ్నాప్ చేశారు. డ్రగ్స్ ఇచ్చి కారులో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు.
కాగా, ఆ వ్యక్తి తెలివిలోకి రావడం గమనించిన యువతులు, తాము సేవిస్తున్న మద్యాన్ని బలవంతంగా అతడితో తాగించారు. అనంతరం నలుగురు యువతులు ఒకరి తర్వాత మరొకరు అతడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మళ్లీ అతడి కళ్లకు గుడ్డ, చేతులు కట్టేసి నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు.
మరోవైపు బాధిత వ్యక్తి ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కేవలం మీడియాకు మాత్రమే వెల్లడించాడు. 20 ఏళ్ల వయసున్న నలుగురు యువతులు కేవలం లైంగిక వాంఛ తీర్చుకునేందుకే తనను కిడ్నాప్ చేశారని అతడు తెలిపాడు. వారు ఉన్నత కుటుంబాలకు చెందినట్లుగా కనిపించారని, ఇంగ్లీష్లోనే మాట్లాడుకున్నారని చెప్పాడు. కాగా, ఈ విషయం తెలిసిన పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దీనిని సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నది.