తనను పూర్తిగా కంట్రోల్ చేయడానికి భార్య చేతబడి చేయిస్తోందని ఒక వ్యక్తి కోర్టుకెక్కాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది. తనను ఇల్లరికం రావాలని అత్తమామలు అడిగారని, దానికి నిరాకరించడంతో వాళ్లంతా కలిసి చేతబడి చేయించడానికి ప్రయత్నిస్తున్నారని బాధితుడి ఆరోపణ. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోలేదని, అందుకే కోర్టు మెట్లు ఎక్కానని చెప్పాడతను.
ఇంటి కప్బోర్డులో నిమ్మకాయలు, కుంకుమ, మిరపకాయలు చాలాసార్లు కనిపించాయని, అలాగే భార్య తనకు రెండు మూడుసార్లు బూడిద కలిపిన భోజనం పెట్టిందని బాధితుడు చెప్పాడు. ఈ విషయమై అత్తమామలను, భార్యను నిలదీసినా వాళ్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నాడు. దాంతో భార్య మొబైల్లో కాల్ రికార్డింగ్ యాప్ ఇన్స్టాల్ చేశానని, దానిలో రికార్డయిన మాటలతో విషయం బయటపడిందని చెప్పాడు.
కోర్టులో ఈ సాక్ష్యాలన్నీ ప్రవేశపెట్టిన బాధితుడు.. సెక్షన్ 156(3) కింద మరింత దర్యాప్తు చేయించాలని కోరాడు. ఈ కేసును స్వీకరించిన కోర్టు.. సదరు సెక్షన్ కింద కాకుండా, సెక్షన్ 200 కింద పిటిషన్ను గుర్తించింది. బాధితుడి భార్య, అత్తమామలపై వివిధ సెక్షన్ల కింద కేసులు రిజిస్టర్ చేయాలని పోలీసులను ఆదేశించింది.