కోల్కతా, అక్టోబర్ 3: పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది. మూడు స్థానాల్లోనూ విజయం సాధించింది. సీఎం మమతా బెనర్జీ భవానీపూర్లో 58,835 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు. మమతకు 85,263 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి టిబ్రివాల్కు 26,428 ఓట్లు పడ్డాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమత నందిగ్రామ్ నుంచి పోటీ చేసి సువేందు చేతిలో ఓడిపోయారు. ఆమె సీఎంగా కొనసాగాలంటే ఈ ఉప ఎన్నికలో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో భారీ విజయాన్ని సాధించారు. జంగీపూర్లో టీఎంసీ అభ్యర్థి జాకీర్ హుస్సేన్ 92,480 ఓట్ల మెజారిటీతో గెలవగా, షంషేర్ గంజ్లో అమీరుల్ ఇస్లామ్ 26,379 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇదిలా ఉండగా ఒడిశాలోని పిప్లిలో నిర్వహించిన ఉప ఎన్నికలో అధికార బీజేడీ అభ్యర్థి రుద్రప్రతాప్ మహారథి విజయం సాధించారు.