కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ అపాయింట్మెంట్ లభిస్తే వారిని కలుస్తానని గురువారం ఆమె తెలిపారు. ఢిల్లీలో కరోనా పరిస్థితి మెరుగైందన్న మమత, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి కొంత మంది నాయకులను కలుస్తానని వెల్లడించారు. కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఈ నెల 25న ఢిల్లీకి వెళ్తారని సమాచారం. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తోపాటు ప్రతిపక్షాలకు చెందిన పలు పార్టీల నేతలను ఆమె కలుస్తారని తెలుస్తున్నది.
మరోవైపు బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలన్ని కలిసి ఒక కూటమిగా ఏర్పడవచ్చన్న టాక్ వినిపిస్తున్నది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల శరద్ పవార్తోపాటు సోనియా, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. మమత బెనర్జీ ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఈ మేరకు ఊహాగానాలు వెలువడుతున్నాయి.