Trinamool తృణమూల్ కాంగ్రెస్ చైర్పర్సన్గా సీఎం మమతా బెనర్జీ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు సంవత్సరాల తర్వాత తృణమూల్ సంస్థాగత ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీఎంసీ అధినేత్రిగా సీఎం మమతా బెనర్జీ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పార్థా ఛటర్జీ ప్రకటించారు. అయితే అధ్యక్ష పోటీకి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. మమతా బెనర్జీకి అనుకూలంగా మొత్తం 48 మంది నేతలు నామినేషన్లు దాఖలు చేశారని, చైర్పర్సన్ పదవికి ఇతరులెవ్వరూ నామినేషన్లు దాఖలు చేయలేదని అన్నారు. దీంతో మమతాయే తిరిగి చైర్పర్సన్గా ఎన్నికయ్యారని పార్థా ఛటర్జీ వెల్లడించారు.
కాంగ్రెస్కు గుడ్బై చెప్పి, 1998 లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించారు. అప్పటి నుంచే ఆమె పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతూ వస్తున్నారు. 2001, 2006 ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న ఏకైక తలంపుతో ఆమె కమ్యూనిస్టు పార్టీలతో వీరోచితంగానే పోరాటం చేశారని చెప్పాల్సి వుంటుంది. అంతేకాకుండా సింగూరు భూ పోరాటం, నానో కార్ల పోరాటం కూడా మమత నేతృత్వంలోనే సాగింది. ఆ తర్వాత 2011 లో కమ్యూనిస్టుల కంచు కోటను బద్దలు కొట్టి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు మమతా బెనర్జీ.