కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హిందీ దివస్ ( Hindi Diwas ) రోజు.. తాను పోటీ చేయబోతున్న భవానీపూర్లోని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. హిందీ దివస్ శుభాకాంక్షలు చెబుతూ.. హిందీలో ఆమె ట్వీట్ చేశారు. అయితే కాస్త ఎదురుతన్నింది. ఈ హిందీ ట్వీట్ చూసి ఆమె అభిమానులే తీవ్రంగా మండిపడుతున్నారు. హిందీ కోసం ఇంతలా పరితపిస్తున్నారు.. భవానీపూర్లో ఓట్ల కోసమే ఈ ప్రయత్నమైతే.. మీకు 2019లో వచ్చిన ఫలితమే రిపీటవుతుంది అని ఓ తృణమూల్ అభిమాని ట్వీట్ చేయడం గమనార్హం.
మమతా ఉప ఎన్నికలో పోటీ చేయబోయే భవానీపూర్లో గుజరాతీ, మార్వాడీ, పంజాబీ మాట్లాడే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇది గమనించే అటు బీజేపీ కూడా మార్వాడీ అయిన ప్రియాంకా తిబ్రేవాల్ను బరిలోకి దింపింది. ఈ నేపథ్యంలో మమత చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బయటవాళ్లు కామెంట్తో బీజేపీ నాయకత్వంపై దాడి చేసిన మమత ఇప్పుడు అదే బయటివాళ్లను ఆకర్షించడానికి ఇలా హిందీలో ట్వీట్ చేయడమేంటన్న విమర్శలు వస్తున్నాయి.
మీరు ఎంత వెన్న పూసినా వాళ్లు మీకు వ్యతిరేకంగానే ఉంటారు. మీరు చేసిన ఈ ట్వీట్ వాస్తవాన్ని మార్చదు. మా ఓట్లు కావాలంటే మీరు కూడా బీజేపీలాగా చేయడం ఆపండి అంటూ మరో అభిమాని కాస్త ఘాటుగా స్పందించాడు. హిందీని మాపై రుద్దకండి అని మరో నెటిజన్ కామెంట్ చేయగా.. మీరు చేసిన ట్వీట్ను 86 శాతం మంది బెంగాలీలు అర్థం చేసుకోలేరని, బంగ్లా దివస్ను హిందీ బెల్ట్లో సెలబ్రేట్ చేసుకుంటారా అని మరొకరు ప్రశ్నించారు.