Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో 2016లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలు చెల్లవంటూ సోమవారం కలకత్తా హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి స్పందించారు. నియామకాలను రద్దు చేయడంతోపాటు వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలన్న కోర్టు ఆదేశాలను సవాలు చేస్తామని ఆమె తెలిపారు. హైకోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన వారికి తాము అండగా నిలుస్తామని మమత హామీ ఇచ్చారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర బెంగాల్లోని రాయ్గంజ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మమతాబెనర్జి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలకత్తా హైకోర్టు తీర్పుపై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉపాధ్యాయ నియామక ప్రక్రియను రద్దు చేయడం చట్ట విరుద్ధం. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా నిలబడతాం. వారికి న్యాయం జరిగేవరకు పోరాడతాం. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తాం. ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు అధైర్యపడొద్దు’ అన్నారు.
అదేవిధంగా ఉపాధ్యాయులు 8 ఏళ్లుగా తీసుకున్న వేతనాన్ని కేవలం 4 వారాల గడువులో చెల్లించడం ఎలా సాధ్యపడుతుందని మమతాబెనర్జి ప్రశ్నించారు. కొందరు బీజేపీ నేతలు న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేత సువేందు అధికారి ఇటీవల కార్యకర్తలతో మాట్లాడుతూ.. ‘సోమవారం వరకు వేచి చూడండి. కీలక పరిణామం చోటుచేసుకుంటుంది. దాంతో ఆ పార్టీ ఇక కోలుకోలేదు’ అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ‘కోర్టు తీర్పు రాకముందే వారికెలా (బీజేపీ నేతలకు) తెలిసింది..?’ అని మమత ప్రశ్నించారు. దాంతో తృనమూల్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాట్లు, అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తాను అలా అన్నానని సువేంధు అధికారి వివరణ ఇచ్చారు. ఇదిలావుంటే హైకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతించింది. అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగిందని పేర్కొంది. కాగా, ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్ సి, గ్రూప్ డి సిబ్బంది నియామకాల కోసం 2016లో ప్రభుత్వం రాష్ట్రస్థాయి సెలక్షన్ నిర్వహించింది.
24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్మెంట్ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అందులో ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. ఈ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై కలకత్తా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ (SLST) నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టంచేసింది. ఆ పరీక్షతో జరిపిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. ఆ పరీక్ష ద్వారా ఎంపికైన టీచర్లు వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.