కోల్కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి లాయర్ అవతారం ఎత్తారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తమ పార్టీ నేతలు, కార్యకర్తలు, పార్టీ కార్యాలయాలపై అధికార బీజేపీ పాల్పడిన దాడులకు సంబంధించిన కేసులో స్వయంగా వాదించడానికి నల్లకోటు ధరించి గురువారం ఆమె కలకత్తా హైకోర్టుకు వచ్చారు. ఆమె వెంట పార్టీ సీనియర్ నేతలు చంద్రిమా భట్టాచార్య, కల్యాణ్ బెనర్జీ తదితరులు వచ్చారు.
ఎన్నికల అనంతరం తమపై జరిగిన హింసపై టీఎంసీ తరపున న్యాయవాది శీర్షాన్య బందోపాధ్యాయ ఈ నెల 12న పిల్ దాఖలు చేశారు. పలువురు టీఎంసీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, బలవంతంగా వారిని ఇండ్ల నుంచి గెంటేశారని వారు తమ పిటిషన్లో ఆరోపించారు.
తమ కార్యకర్తలపై దాడిపై టీఎంసీ దాఖలు చేసిన కేసులో వాదించడానికి స్వయంగా ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ న్యాయవాదిగా కలకతా హైకోర్టుకు హాజరైన క్రమంలో లాయర్గా ఆమె కేసు వాదించడానికి అర్హురాలేనా అన్న ప్రశ్నలు తలెత్తాయి. దీంతో మమత ఎప్పుడు న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో నమోదు చేసుకున్నారు, ప్రాక్టీస్ తదితర వివరాలు 48 గంటల్లోగా తమకు సమర్పించాలని పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ను భారత బార్ కౌన్సిల్ (బీసీఐ) కోరింది.
నిబంధనల ప్రకారం రాజ్యాంగ పదవిని నిర్వహించే లేదా వేతనంతో కూడిన ఉద్యోగంలో ఉన్న వ్యక్తి తన సేవా కాలంలో బార్ లైసెన్స్ను నిలిపివేయించుకోవాల్సి ఉంటుంది