న్యూఢిల్లీ, ఆగస్టు 25: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మొత్తం 29 ఫోన్లలో ఐదింటిలో మాల్వేర్ను గుర్తించినట్టు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపింది. అయితే, ఆ మాల్వేర్ పెగాసస్ స్పైవేర్ అని చెప్పలేమని వెల్లడించింది. కాకపోతే, ఐదు ఫోన్లలో మాల్వేర్ను గుర్తించటం ఆందోళనకరమైన విషయమేనని కమిటీ తెలిపిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని బెంచ్ పేర్కొన్నది. కమిటీ అందజేసిన నివేదికను గురువారం కోర్టులో సీజేఐ చదివి వినిపించారు.
కేసు దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని కమిటీ పేర్కొన్నట్టు వెల్లడించారు. కాగా, ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు, జడ్జిలు, జర్నలిస్టులపై నిఘా పెట్టేందుకు కేంద్రం ఇజ్రాయెల్కు చెందిన పెగాసస్ స్పైవేర్ను ఉపయోగించిందని కొందరు ఆరోపించారు. దీంతో కేంద్రం స్పైవేర్ను ఉపయోగించిందా? లేదా? అని నిర్ధారించేందుకు సుప్రీం కోర్టు ఒక టెక్నికల్ కమిటీని నియమించింది. ఆ కమిటీయే తాజాగా సుప్రీం కోర్టుకు మూడు భాగాలతో నివేదికను అందజేసింది.
సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి అడిగిన సమాచారం ఇవ్వకపోవటం అంటే కేంద్రం పెగాసస్ను వాడినట్టే అవగతమవుతున్నదని కాంగ్రెస్ ఆరోపించింది. కేంద్రం ఇజ్రాయెల్ స్పైవేర్ను వాడి ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చిందని మండిపడింది.