కేంద్రాన్ని కోరిన పవార్
ముంబై, ఆగస్టు 16: రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలిగించడానికి రాజ్యాంగ సవరణ చేయాలని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ డిమాండ్ చేశారు. తద్వారా 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ర్టాలకు వీలు కల్పించాలన్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ‘కోర్టు తీర్పు కంటే రాజ్యాంగం ఉన్నతం’ అని వ్యాఖ్యానించారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలు, రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్టికల్స్ 15(4), 16(4) గురించి ప్రస్తావిస్తూ… రిజర్వేషన్లపై అవి ఎలాంటి పరిమితిని విధించలేదని చెప్పారు. కాబట్టి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పెంచడంలో రాజ్యాంగపరమైన అడ్డంకులు లేవన్నారు. రిజర్వేషన్ల విషయంలో ప్రజలను మోదీ ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. కులాలవారీగా జనాభా గణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల రాజ్యసభలో మార్షల్స్ను ఉపయోగించడం ఎంపీలపై, ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనన్నారు. కేంద్రం 40 మంది మార్షల్స్తో బలప్రయోగం చేయడం 54 ఏండ్ల తన పార్లమెంటరీ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు.