హైదరాబాద్: ఒడిశాలోని (Odish) బాలేశ్వర్ (Baleshwar) సమీపంలోని బహనాగ్బజార్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు ప్యాసింజర్ రైళ్లు, ఓ గూడ్సు రైలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 230 మందికిపైగా మరణించారు. మరో 900 మంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ దశాబ్దంలోనే అతి పెద్ద ప్రమాదం ఇదేనని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో 2012 నుంచి గత పదేండ్లలో జరిగిన భారీ రైలు ప్రమాదాల (Major train accidents) గురించి తెలుసుకుందాం..
బికనీర్-గువాహటి ఎక్స్ప్రెస్..
2022, జనవరి 13న బికనీర్-గువాహటి ఎక్స్ప్రెస్ పశ్చిమ బెంగాల్లోని అలీపూర్దువార్లో పట్టాలు తప్పింది. దీంతో 12 బోగీలు ట్రాక్ మీదినుంచి పక్కకు వెళ్లడంతో 9 మంది మరణించారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పూరి-హరిద్వార్ ఉత్కల్ ఎక్స్ప్రెస్2017, ఆగస్టు 18న పూరి-హరిద్వార్ ఉత్కల్ ఎక్స్ప్రెస్ రైలు ముజఫర్నగర్లో పట్టాలు తప్పింది. దీంతో 23 మంది గాయపడగా, 60 మంది గాయపడ్డారు. అదే ఏడాది ఆగస్టు 23న ఢిల్లీ వెళ్తున్న కైఫియత్ ఎక్స్ప్రెస్కు చెందిన 9 కోచ్లు ఉత్తరప్రదేశ్లోని ఔరయ్యా వద్ద పట్టాలు తప్పాయి. దీంతో 70 మంది గాయపడ్డారు.
ఇండోర్-పాట్నా ఎక్స్ప్రెస్
2016, నవంబర్ 20న ఇండోర్-పాట్నా ఎక్స్ప్రెస్ కాన్సూర్ పుఖ్రాయాన్కు సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 150 మంది మరణించారు. మరో 150 మందికిపైగా గాయపడ్డారు.
గోరఖ్ధామ్ ఎక్స్ప్రెస్
2014, మే 26న గోరఖ్ఫూర్ వైపు వెళ్తున్న గోరఖ్ధామ్ ఎక్స్ప్రెస్ రైలు ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్నగర్ ప్రాంతంలోని ఖలీలాబాద్ స్టేషన్కు సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో 25 మంది మరణించగా, 50 మందికిపైగా గాయపడ్డారు.
హుబ్లీ-బెంగళూరు హంపి ఎక్స్ప్రెస్..
2013, మే 22న ఆంధ్రప్రదేశ్ సమీపంలో హుబ్లీ-బెంగళూరు హంపి ఎక్స్ప్రెస్, ఓ కార్గో రైలు ఢీకొన్నాయి. దీంతో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ప్రమాదం కారణంగా రైలులో మంటలు చెలరేగడంతో సుమారు 25 మంది మరణించారు. మరో 43 మంది గాయపడ్డారు.