న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీని షేర్ చేసే యూట్యూబ్ వీడియోలను, ట్వీట్లను బ్లాక్ చేస్తూ కేంద్ర సమాచార ప్రసారమంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని టీఎంసీ ఎంపీ మహువ మొయిత్ర తప్పుపట్టారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య మూలాలు అభద్రతతో ఉన్నాయని టీఎంసీ ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్లో ఏ ఒక్కరూ మోదీపై తీసిన బీబీసీ డాక్యుమెంటరీని వీక్షించకుండా కేంద్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిందని మన ప్రజాస్వామ్య వ్యవస్ధకు ఇది సిగ్గుచేటని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్రం తీరును తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ కూడా తప్పుపడుతూ మోదీకి వ్యతిరేకంగా తీసిన బీబీసీ డాక్యుమెంటరీపై కేంద్రం ఆదేశాలకు సంబంధించి తాను చేసిన ట్వీట్లలో ఓ ట్వీట్ను తొలగించారని చెప్పారు.
కాగా రెండు భాగాలుగా తీసిన ఈ డాక్యుమెంటరీలో ప్రధాని మోదీ 2002లో గుజరాత్ సీఎంగా వ్యవహరించిన సమయంలో తలెత్తిన అల్లర్లకు సంబంధించిన విషయాలను ప్రస్తావించారు. ఇక వలసవాద దృక్పధంతో ఎలాంటి లక్ష్యం లేని ప్రచారయావతో బీబీసీ డాక్యుమెంటరీ రూపొందిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభివర్ణించింది.