డెహ్రాడూన్, ఆగస్టు 12: ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మహేంద్ర భట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారత ఉత్సవాల్లో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు అందరూ తమ ఇండ్లపై జాతీయ జెండాలు ఎగురవేయాలని, అలా ఎగురవేయని వారి ఇండ్ల ఫొటోలు తీసి తనకు పంపాలని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇండ్లపై జెండా ఎగురవేయని వారిని ఈ దేశం విశ్వసించదని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో.. తాను చేసిన వ్యాఖ్యలు సాధారణ ప్రజలను ఉద్దేశించి కాదని, తమ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అని తాజాగా చెప్పుకొచ్చారు. అయితే ఇదే సమయంలో దేశభావాలు కలిగిన వారికి జెండా ఎగురవేయడంలో ఎటువంటి సంకోచం, సమస్య ఉండదని తాను విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు.