ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. అధికర శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఉద్ధవ్ థాక్రే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించినప్పటికీ అసమ్మతి ఎమ్మెల్యేలు శాంతించడంలేదు. దీంతో సీఎం ఉద్ధవ్ సతీమణి రష్మీ థాక్రే (Rashmi Thackeray) రంగంలోకి దిగారు. ఉద్ధవ్పై తిరుగుబాటు జెండా ఎగురవేసి.. అసమ్మతి కూటమిలో చేరిన ఎమ్మెల్యేల భార్యలను కలుస్తున్నారు. ఒక్కొక్కరి ఇంటికి వెళ్తున్న రష్మీ థాక్రే.. వారి భర్తలను ఒప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రయత్నం ఎంతమేరకు ఫలిస్తుందో చూడాలి.
కాగా, శనివారం శివసేన జాతీయ కార్యవర్గ సమాశం జరిగింది. ఇందులో రెబల్స్పై చర్యలు తీసుకొనేందుకు ఉద్ధవ్కు అధికారం అప్పజెప్పుతూ తీర్మాణం చేశారు. అయితే, వారిపై వెంటనే చర్యలు తీసుకోకూడదని, వేచి చూడాలని నిర్ణయించింది. ఏ రాజకీయ వర్గం కూడా శివసేన పేరు, బాల్ ఠాక్రే పేరును ఉపయోగించుకోవద్దని మరో తీర్మానం చేసింది. ‘ఓట్లు అడిగేవారు మీ తండ్రి పేరిట ఓట్లడగండి కానీ బాల్ ఠాక్రే పేరు వాడొద్దు’ అని ఉద్ధవ్ ఠాక్రే రెబల్స్కు స్పష్టం చేసినట్టు పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. కాగా, ఏక్నాథ్ షిండే సహా 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి శనివారం సమన్లు పంపించారు. వారిని ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన ఫిర్యాదులపై సోమవారంలోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోరారు.