ముంబై: మహారాష్ట్ర సీఎం, శివసేన రెబల్ వర్గం నేత ఏక్నాథ్ షిండేను ఛత్రపతి శివాజీతో ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా పోల్చారు. సతారా జిల్లాలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై ఏక్నాథ్ షిండే తిరుగుబాటును.. నిర్బంధంలో ఉన్న శివాజీ, చివరకు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కస్టడీ నుంచి తప్పించుకోవడంతో పోల్చారు. దీంతో మహారాష్ట్రకు చెందిన ప్రతిపక్షాలు మంత్రి లోధాపై మండిపడ్డాయి.
శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకురాలు, ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్లో ఘాటుగా విమర్శించారు. విద్రోహపూరితంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంతో శివాజీ ధైర్యాన్ని మంత్రి లోధా పోల్చడం బీజేపీ రాజకీయ దివాళాకోరుతనానికి మరో చిహ్నమని దుయ్యబట్టారు. ‘మహారాష్ట్ర ఆరాధ్యదైవాన్ని ప్రతిరోజూ అగౌరవపరుస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధమైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారు. కొంచెం సిగ్గుపడండి’ అని హిందీ ట్వీట్ ద్వారా విమర్శించారు.
మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా మంత్రి లోధా వ్యాఖ్యలను ఖండించారు. ‘విశ్వాసాన్ని అమ్ముకున్న ద్రోహులను ఛత్రపతి శివాజీతో పోల్చడం హిందూ మతం కాదు. మహారాష్ట్రపై ద్వేషం! మహారాష్ట ఉనికిని నాశనం చేయడం ఈ ప్రభుత్వం లక్ష్యం’ అని మరాఠీలో చేసిన ట్వీట్లో మండిపడ్డారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, ఎన్సీపీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్ కూడా మంత్రి లోధా వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తం చేశారు. సీఎం ఏక్నాథ్ షిండేను శివాజీతో పోల్చడంపై తాను ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నారు. మరోవైపు మంత్రి లోధా తన పదవికి రాజీనామా చేయాలని మహారాష్ట్ర కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాగా, గవర్నర్ కోష్యారీ ఇటీవల శివాజీపై చేసిన వ్యాఖ్యలపై వివాదం ముగియకముందే ఆ రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలతో మరో దుమారం రేగింది.
इमान विकलेल्या गद्दारांची तुलना छत्रपती शिवरायांशी करणं हे हिंदुत्व नाही, हा महाराष्ट्र द्वेष आहे!
‘महाराष्ट्राचं खच्चीकरण’ हेच या खोके सरकारचं ध्येय आहे!— Aaditya Thackeray (@AUThackeray) December 1, 2022
ग़द्दारी से बनाई सरकार की तुलना छत्रपति शिवाजी महाराज के शौर्य से जोड़ना फिर से भाजपा के राजनीतिक दीवालियापन का प्रतिक है।
हर दिन महाराष्ट्र के आराध्य देव का तिरस्कार हो रहा है और असंवैधानिक मुख्य मंत्री और उप मुख्यमंत्री शांत है। शर्म करो! pic.twitter.com/Al6beXu3sl— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) November 30, 2022