ముంబై, ఆగస్టు 1: ముంబైపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ క్షమాపణలు చెప్పారు. గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్ర నుంచి వెళ్లిపోతే ఇక్కడ డబ్బులు మిగలదని, ముంబై ఆర్థిక రాజధానిగా ఉండబోదని కోశ్యారీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై మహారాష్ట్ర ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. దీంతో ఆయన తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. కావాలని తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని, పొరపాటు జరిగినందుకు చింతిస్తున్నానని అన్నారు. మహారాష్ట్ర ప్రజలు విశాల హృదయంతో తనను మన్నించాలని కోరారు.