ముంబై: మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ మాజీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి కృపాశంకర్ సింగ్ బీజేపీలో చేరారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కృపాశంకర్ సింగ్ గతంలో కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ సర్కారులో మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అంతేగాక 2008 నుంచి 2012 వరకు ఆయన మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
అయితే, కృపాశంకర్ సింగ్ మంత్రిగా పనిచేసినప్పుడు ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అంతేగాక ఆయనపై పలు అవినీతి కేసులతోపాటు, అక్రమాస్తులు కేసులు కూడా ఉన్నాయి. దాంతో కేంద్ర సర్కారు కేసుల ద్వారా ఆయనపై ఒత్తిడి చేస్తూ కాంగ్రెస్ పార్టీని వీడేలా చేసింది. 2019, సెప్టెంబర్ 10న ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అప్పుడే ఆయన బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరిగినా.. దాదాపు రెండేండ్లు రాజకీయాలకు దూరంగా ఉండి ఇప్పుడు బీజేపీలో చేరారు.