న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి(Manohar Joshi) ఇవాళ కన్నుమూశారు. ముంబై ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 86 ఏళ్లు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ముంబైలోని శివాజీపార్క్లో ఉన్న శ్మశానవాటికలో మనోహర్ జోషికి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పీడీ హిందూజా ఆస్పత్రిలో ఆయన గత కొంత కాలం నుంచి చికిత్స పొందుతున్నారు.
ఈనెల 21వ తేదీన ఆయన్ను హిందుజా ఆస్పత్రిలో చేర్పించారు. గుండెపోటుతో ఆయన చాలా తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. ఐసీయూలో ఆయనకు చికిత్స అందించారు. 1995 నుంచి 1999 వరకు మహారాష్ట్ర సీఎంగా ఆయన పనిచేశారు. మనోహర్ జోషి ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. 2002 నుంచి 2004 వరకు ఆయన లోక్సభ స్పీకర్గా చేశారు.
మహారాష్ట్రలోని రాయిగడ్ జిల్లాలో నంద్వి గ్రామంలో డిసెంబర్ 2, 1937లో ఆయన జన్మించారు. ముంబైలో ఆయన విద్యాభ్యాసం సాగించారు. అనఘ మనోహర్ జోషిని ఆయన పెళ్లాడారు. 75 ఏళ్ల వయసులో ఆమె 2020లో మరణించారు. ఆ జంటకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మనోహర్ జోషి తన కెరీర్ను ఓ టీచర్గా ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన 1967లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. శివసేన పార్టీతో ఆయనకు 40 ఏళ్ల అనుబంధం ఉన్నది. 1968-70 నుంచి ముంబై మున్సిపల్ కౌన్సిలర్గా చేశారు. 1976 నుంచి 1977 వరకు ముంబై మేయర్గా చేశారు. 1972లో తొలిసారి ఆయన మహారాష్ట్ర మండలికి ఎన్నికయ్యారు. మూడు సార్లు మండలికి పనిచేశారు. ఆ తర్వాత 1990లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు.