ముంబై : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో కలకలం సృష్టిస్తున్నది. ఇవాళ ఒకే రోజు 16 మందికి పాజిటివ్గా తేలింది. మధ్యాహ్నం ఢిల్లీలో నలుగురు, రాజస్థాన్లో నలుగురు వేరియంట్ బారినపడగా.. తాజాగా మహారాష్ట్రలో ఎనిమిది మందికి పాజిటివ్గా గుర్తించారు. ఏడుగురు రోగులు ముంబైకి చెందిన వారు కాగా.. ఒకరు వసాయ్ విరార్కు చెందిన వ్యక్తి. కొత్త కేసులతో కలిపి ఇప్పటి వరకు మహారాష్ట్రలో 28 మంది ఒమిక్రాన్ బారినపడ్డారని ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇందులో ముంబైలో 12 మంది, పింప్రి చించ్వాడ్లో 10, పుణెలో ఇద్దరు, కల్యాణ్ డోంబివాలి, నాగ్పూర్, లాతూర్, వసాయ్ విరార్లో ఒక్కొక్కరు మహమ్మారి బారినపడ్డారని పేర్కొంది. ఇవాళ కొత్త స్ట్రెయిన్ బారినపడ్డ వారంతా డిసెంబర్ మొదటి వారంలో కరోనాకు పాజిటివ్గా పరీక్షించగా.. నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపినట్లు పేర్కొంది. ఎనిమిది రోగుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని, ఐదుగురు పురుషులున్నారన్న ఆరోగ్యశాఖ.. ముగ్గురిలో ఎలాంటి లక్షణాలు లేవని, ఐదుగురికి తేలికపాటి లక్షణాలున్నాయని వివరించింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. వీరిలో ఎవరికీ అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర లేదని, ఇందులో ఒకరు బెంగళూరు, మరొకరు ఢిల్లీకి వెళ్లినట్లు చెప్పింది. ఎనిమిది మంది బాధితుల్లో ఇద్దరు ఆసుప్రతిలో ఉన్నారని, ఆరుగురు హోం ఐసోలేషన్లో ఉన్నారని, కాగా, ఏడుగురు టీకాలు తీసుకున్నవారున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది. తాజా కేసులతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కు పెరిగింది. మరో వైపు ఇంతకు ముందు రాజస్థాన్లో ఒమిక్రాన్ బారినపడ్డ వారంతా కోలుకున్నారు.