ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదురుతున్నది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి గౌహతిలో క్యాంప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలుమార్లు బుజ్జగింపు ప్రయత్నాలు చేసినా చివరకు బెట్టువీడకపోవడంతో తిరుగుబాటు నేతలకు ఆ పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా హెచ్చరిస్తున్నారు. ‘ఇంకా ఎంతకాలం గౌహతిలో దాక్కుంటారు? చౌపట్టికి తిరిగిరావాలి’ అంటూ ఆదివారం ట్వీట్ చేశారు.
శివసేన అనర్హత పిటిషన్పై 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నోటీసులు అందించిన మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ చిత్రాన్ని సైతం సంజయ్ రౌత్ షేర్ చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ శనివారం నోటీసులు జారీ చేసి, లిఖితపూర్వక సమాధానాలను దాఖలు చేసేందుకు సోమవారం వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు, షిండే వర్గం ‘శివసేన బాలాసాహెబ్’ పేరిట కొత్త పార్టీని ప్రకటించింది. ఈ క్రమంలో శివసేన జాతీయ కార్యవర్గం సమావేశమై శివసేన, బాలాసాహెబ్ పేరును వాడకుండా తీర్మానం చేసింది.
శనివారం సంజయ్ రౌత్ మాట్లాడుతూ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనను ప్రజలు విశ్వసిస్తారన్నారు. బయటకు వెళ్లిన వారు శివసేన పేరు పెట్టుకోవద్దని, తండ్రి పేరు చెప్పి ఓట్లు అడగవద్దన్నారు. వారు ఏమి చేయాలనుకుంటే అది చేయనివ్వండి, ముంబై రావాలి కాదా? అక్కడ కూర్చొని మీరు మాకు ఏమి
సలహా ఇస్తున్నారు? లక్షలాది మంది శివసైనికులు మా నుంచి సంకేతం కోసం ఎదురు చూస్తున్నారు’ అంటూ హెచ్చరించారు. మరో వైపు రెబెల్ ఎమ్మెల్యేల ఆఫీసులపై శివసేన కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు.