న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే బావమరిది (భార్య సోదరుడు) శ్రీధర్ మాధవ్ పాతంకర్కు చెందిన రూ.6.25 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీజ్ చేసింది. మనీల్యాండరింగ్ కేసులో వీటిని జప్తు చేసినట్టు వెల్లడించింది. శ్రీ సాయిబాబా గృహనిర్మితి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి యజమాని అయిన శ్రీధర్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడని ఈడీ ఆరోపిస్తున్నది.
ఈ నేపథ్యంలోనే థాణెలోని నీలాంబరి ప్రాజెక్టులో గల 11 ఫ్లాట్లను సీజ్ చేసినట్టు పేర్కొంది. మరోవైపు ఆస్తుల జప్తు రాజకీయ కక్షసాధింపేనని శివసేన విమర్శించింది. ‘తనకు లొంగని వ్యక్తులపై కేంద్రం ఇలాంటి దాడులకు పాల్పడుతున్నది. బెంగాల్లో సీఎం మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ఈడీ వేధిస్తున్నది. అలాగే మహారాష్ట్రలోనూ ఇదే పంథాను కొనసాగిస్తున్నది. ఇది కేంద్రం కక్షసాధింపు చర్యే’ అని శివసేన ధ్వజమెత్తింది. ఈడీ చర్య రాజకీయ ప్రేరేపితమైనదని ఎన్సీపీ అధినేత శరద్పవార్ విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం.. దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అని అన్నారు.
‘భారత్ను ముహమ్మద్ అలీ జిన్నా ఒక్కసారే విభజించారు. కానీ బీజేపీ నేతలు మాత్రం వారి వ్యాఖ్యలతో హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెడుతూ దేశాన్ని రోజూ విడగొడుతున్నారు’
– సంజయ్ రౌత్, శివసేన ఎంపీ