అమరావతి : వివాహ కార్యక్రమానికి వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. కారులో వెళ్తున్న సమయంలో మృత్యురూపంలో వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్ర అమరావతి జిల్లాలోని నంద్గావ్పేట్-దేవల్గావ్ రింగ్ రోడ్డులో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంజన్ గావ్ సుర్జీ గ్రామానికి చెందిన కుటుంబం వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వాల్గావ్ మీదుగా నంద్గావ్పేట వైపు వెళ్తున్నది. కారు పోటే కళాశాల వద్దకు రాగానే.. డ్రైవర్ ద్విచక్ర వాహనాన్ని ఓవర్ టెక్ చేసేందుకు ప్రయత్నించాడు.
అదే సమయంలో ఎదురుగా వేగంగా వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. ఆ తర్వాత ట్రకు విద్యుత్ స్తంభానికి ఢీకొట్టి.. రోడ్డు అవతలి వైపు ఎగిరిపడిందని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అక్కడే కొందరు కూలీలు ప్రమాదాన్ని గమనించి వెంటనే కారులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించి అతను సైతం మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.