ముంబై: కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం చినికిచినికి గాలివానలా మారుతున్నది. సరిహద్దు వివాదంపై కర్ణాటకలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనలు, ఆందోళనలు.. ఇప్పుడు దాడుల వరకు చేరాయి. మంగళవారం మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులపై కర్ణాటకలో నిరసనకారులు దాడులు చేశారు. బస్సులపైకి రాళ్లు విసిరి అద్దాలు పగులగొట్టారు.
ఈ నేపథ్యంలో ఇవాళ కర్ణాటకకు బస్సు సర్వీసులను నిలిపేస్తున్నట్టు మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్టుమెంట్ ప్రకటించింది. కర్ణాటకలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి బస్సులను నడపడం శ్రేయస్కరం కాదని మహారాష్ట్ర పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో తాము బస్సు సర్వీసులను నిలిపివేశామని తెలిపింది. మళ్లీ పోలీసులు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే బస్సు సర్వీసులను పునఃప్రారంభిస్తామని పేర్కొంది.