చెన్నై, మే 16: మద్రాస్ హైకోర్టు చరిత్రలోనే మొదటిసారి ఓ జడ్జి వాట్సాప్ ద్వారా విచారణ నిర్వహించారు. అది కూడా ఆదివారం. పైగా ఓ పెండ్లికి వెళ్లి అక్కడ నుంచే వాదనలు విన్నారు. జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ఈ ఘనత సాధించారు. ఆదివారం జడ్జి నాగర్కోయిల్లో పెండ్లికి వెళ్లారు. మరోవైపు, ధర్మపురి జిల్లాలోని అభీష్ట వరదరాజస్వామి ఆలయంలో సోమవారం నిర్వహించాల్సిన రథయాత్ర రద్దు చేయాలని అధికారులు ఆదేశించారు. దీనిపై ఆలయ ట్రస్టీ శ్రీనివాసన్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ స్వామినాథన్ వాట్సాప్లో విచారణ చేశారు. రథయాత్ర అడ్డుకొనే అధికారం అధికారులకు లేదని తీర్పునిచ్చారు.